ఉగాది - యుగాది

ఉగస్య ఆది:ఉగాది: - "ఉగ" అనగా న్క్షత్ర గమనం.నక్షత్రగమనానికి 'ఆది' 'ఉగాది'.అంటే సృష్టి ఆరంభమైనదినమే "ఉగాది".'యుగము' అనగా ద్వయము లేక జంట అని కూడా అర్ధము.ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం 'యుగం' (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది (సంవత్సరాది) యుగాది అయింది.యుగాది శబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిగా వ్యవహృతమైనది.తత్రచైత్రశుక్ల ప్రతిపదిసంవత్సరారంభ: - చైత్రశుద్ధ పాడ్యమి నాడు సంవత్సరాది 'ఉగాది'గా ఆచరణీయమని నిర్ణయసింధుకారుడు పేర్కొనియున్నాడు.

ఉగాది పుట్టుపూర్వోత్తరాలు
వేదాలను హరించిన సోమకుని వధించి మత్యావతారధారియైన విష్ణువు వేదాలను బ్రహ్మకప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్ధం 'ఉగాది' ఆచరణలోకి వచ్చెనని పురాణప్రతీతి.చైత్రశుక్లపాడ్యమినాడు విశాలవిశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించెను.కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుపబడుచునందని కూడా చెప్పబడుచున్నది.శాలివాహన చక్రవర్తి చైత్రశుక్లపాడ్యమినాడే పట్టాభిషిక్తుడై తన శౌర్యపరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా భాసిల్లిన కారణాన ఆ యోధాగ్రని స్మృత్యర్థం ఉగాది ఆచరింపబడుతున్నదని చారిత్రక వృత్తాంతం.ఏది ఏమైనా జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని రగుల్కొల్పి మానవాళిలో నూతనాశయాలను అంకురింపచేసే శుభదినం 'ఉగాది'.
"ఉగాది" ఆచరణ విధానం
ఉగాది పర్వాచరణ విధానాన్ని 'ధర్మసింధు' కారుడు 'పంచవిధుల సమన్వితం'గా ఇలా సూచించియున్నాడు.

తైలాభ్యంగం సంకల్పాదవు నూతన వత్సర నామకీర్త నాద్యారంభం...
ప్రతిగృహం ధ్వజారోహణం, నింబపత్రాశనం వత్సరాది ఫలశ్రవణం...

ఉగాదిరోజు
తైలాభ్యంగనం
నూతన సంవత్సరాది స్తోత్రం
నింబకుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం)
ధ్వజారోహణం (పూర్ణకుంభదానం)
పంచాంగ శ్రవణం
మున్నగు 'పంచకృత్య నిర్వహణ' గావించవలెనని వ్రతగంధ నిర్దేశితం.

(1) తైలాభ్యంగనం
తైలాభ్యంగనం అంటే నువ్వుల నూనెతో తలంటి పోసుకోవడం ప్రధమ విధి.ఉగాది వంటి శుభదినాలలో సూర్యోదయానికి పూర్వమే మహాలక్ష్మి నూనెలోను,గంగాదేవి నీటిలోను,ఆవహించి వుండునని ఆర్యోక్తి.కావున నూనెతో తలంటుకుని అభ్యంగన స్నానం చేసిన లక్ష్మి,గంగా దేవుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు."అభ్యంగంకారయోన్నిత్యం సర్వేష్వంగేషు పుష్టినం" (అభ్యంగన స్నానం అన్ని అవయవాలౌ పుష్టిదాయకం) అని ఆయుర్వేదోక్తి దృష్త్యా అభ్యంగనం ఆరోగ్యం కూడా.ఆరోగ్యరీత్యా ఆధ్యాత్మికరీత్యా తైలభ్యంగనానికీ రీతిగా విశేష ప్రాధాన్యమీయబడినది.

(2) నూతన సంవత్సర స్తోత్రం
అభ్యంగ స్నానానంతరం సుర్యునికి,ఆర్ఘ్యదీపధూపాధి,పుణ్యకాలానుష్టానం ఆచరించిన పిదప మామిడి ఆకులతోరణాలతో,పూలతోరణాలతో దేవుని గదిలో మంటపాన్ని నిర్మించి,అందు నూతన సంవత్సర పంచాంగాన్ని,సంవత్సరాది దేవతను,ఇష్టదేవతారాధనతో బాటు పూజించి ఉగాది రసాయనాన్ని (ఉగాది పచ్చడి) నివేదించవలెను.

(3) ఉగాడి పచ్చడి సేవనం
ఉగదినాటి ఆచారాలలో ఉగాది పచ్చడి సేపనం అత్యంత ప్రధానమైనది.వేపపూత,కొత్త చింతపండు,బెల్లం లేక పంచదార లేక చెరకు ముక్కలు,నేయి,ఉప్పు,మిరియాలు,షడ్రుచులు మిళితమైన రసాయనాన్నే ఉగాడి పచ్చడి అంటాం!

అబ్దాదౌ నింబకుసుమం శర్కరామ్ల ఘృతైర్యుతమ్‌
భక్షితం పూర్వయామేతు తద్వర్షే సౌఖ్య దాయకమ్‌


అని ధర్మ సింధుగ్రంధం చెబుతున్నది.ఈ ఉగాడి పచ్చడిని ఇంట్లో అందరూ పరగడుపున సేవించవలెను.ఉగాడినాడు ఉగాడి పచ్చడి సేవించడం వల్ల సంవత్సరమంతా సౌఖ్యదాయకమని ఈ శ్లోక భావం,పలురుచుల మేళవింపు అయిన ఉగాడి పచ్చడి కేవలం రుచికరమే కాడు ప్రభోదాత్మకం కూడా! "తీపి వెనుక చేదు,పులుపూ ఇలా పలురుచులకు జీవితాన కష్టాలు,తదితర అనుభూతులు,ప్రతీకలే అనే నగ్న సత్యాన్ని చాటుతూ సుఖాలకు పొంగకు,దు:ఖానికి క్రుంగకు,సుఖదు:ఖాలను సమభావంతో స్వీకరించు" అనే ప్రగతిశీల సందేశాన్నిస్తుందీ ఉగాది పచ్చడి.అంతేగాక ఈ పచ్చడి సేవన ఫలంగా వివిధ అనారోగ్య స్థితులు పాఅరిహరించబడి,రోగశాంతి,ఆరోగ్యపుష్టి చేకూరుట గమనార్హం.

(4) పూర్ణ కుంభదానం
ఉగాదినాడు ఇంద్రధ్వజ,బ్రహ్మధ్వజ ప్రతిష్టపన ఆచారంగా ఉన్నది .ఒక పట్టు వస్త్రాన్ని ఒక వెదురు గడకు పతాకం వలె కట్టి దానిపై నారికేళముంచబడిన కలశాన్ని వుంచి,ఆ కర్రకు మామిడి ఆకులు,నింబ పత్రాలు,పూల తోరణాలు కట్టి ఇంటి ప్రాంగణంలో ప్రతిష్టించి ఆరాధించడం ధ్వజావరోహణం.ఇటీవల ఈ ఆచారం చాలావరకు కనుమరుగై దాని స్థానంలో కలశ స్థాపన,పూర్ణకుంభదానం ఆచరణలోకి వచ్చింది.


ఏష ధర్మఘటోదత్తో బ్రహ్మ విష్ణు శివాత్మక:
అస్య ప్రదవాత్సకలం మమ: సంతు మనోరధా:

యధాశక్తి రాగి,వెండి,పంచలోహం లేదా మట్టితో చేసిన కొత్తకుండను కలశంలా చేసి రంగులతో అలంకరించి అందులో పంచపల్లవాలు (మామిడి,అశోక,నేరేడు,మోదుగ మరియు వేప చిగుళ్ళు) సుగంధ చందనం కలిపి పుష్పాక్షతలు వేసి ఆవాహనం చేసి,పూజించి కలశానికి ఒక నూతన వస్త్రాన్ని చుట్టి కలశంపై పసుపు కుంకుమ చందనం,పసుపు దారాలతో అలంకరించిన కొబ్బరి బోండాం నుంచి పూజించి పురోహితునకుగాని,గురుతుల్యులకుగానీ,పూర్ణకుంభదానమిచ్చి వారి ఆశీస్సులు పొందడం వల్ల సంవత్సరం పుడవునా విశేష ఫలితం లభిస్తుందని ప్రతీతి.

(5) పంచాంగ శ్రవణం
"తిధిర్వారంచనక్షత్రం యోగ: కరణమేవచ పంచాంగమ్‌"

తిధి,వార,నక్షత్ర,యోగ,కరణఅములనెడి పంచ అంగాల సమన్వితం పంచాంగం.ఉగాది నాడు దేవాలయంలోగాని,గ్రామకూడలి ప్రదేశాల్లోగాని,పండితుల,సిద్థాంతుల సమక్షంలో కందాయఫలాలు స్థూలంగా తెలుసుకొని తదనుగుణంగా సంవత్సరం పొడవునా నడచుకొనుటకు నాడే అంకురార్పణం గావించవలెనని చెప్పబడియున్నది.
"పంచాంగస్యఫలం శృణ్వన్‌ గంగాస్నానఫలంఖిలేత్"

ఉగాదినాటి పంచాంగ శ్రవణం వల్ల గంగానదిలో స్నానం చేస్తే అభించేటంత ఫలితం లభిస్తుంది.
"సూర్యశ్శౌర్య మధేందురింద్రపదవీం" అనెడి పంచాంగ శ్రవణ ఫలశృతి శ్లోకంలో ఉగాదినాడు పంచాంగ శ్రవణం చేసేవారికి సూర్యుడు శౌర్యాన్ని,చంద్రుడు ఇంద్రసమాన వైభవాన్ని,కుజుడు శుభాన్ని,శని ఐశ్వర్యాన్ని,రాహువు బాహుబలాన్ని,కేతువు కులాధిక్యతను కలుగచేస్తారని చెప్పబడినది. 

శ్లోకం
" శతాయు వజ్రదేహాయ సర్వసంపత్‌ కరాయచ 
సర్వారిష్ట వినాశాయ నింబకం దళబక్షణం " 
ఉగాదినాడు ఈ శ్లోకమును చదివి ఉగాదిపచ్చడి ని తీసుకోవాలి.

'బ్రహ్మ ప్రళయం' పూర్తి అయిన తరువాత తిరిగి సృష్టి ప్రారంభించుసమయాన్ని 'బ్రహ్మకల్పం' అంటారు.ఇలా ప్రతికల్పంలోను మొదటవచ్చే యుగాదిని యుగానికి ఆదిగా,ప్రారంభసమయమును "ఉగాది" అని వ్యవహరిస్తూ ఉంటారు.అలాగునే ఈ 'ఉగాది' పర్వదినం మనకు చైత్రమాసంలో ప్రారంభ మవడం వల్ల ఆరోజునుండి మన తెలుగు సంవత్సర ఆరంభ దినంగా పరిగణించి,లెక్కించుటకు వీలుగా ఉండేందుకే ఉగాది పండుగను మనకు ఋషిపుంగవులు ఏర్పాటు చేశారు.

లక్ష్మీప్రాప్తికి, విజయసాధనకు చైతన్యం కావాలి. జీవునకు చైతన్యం కలిగించేది కాలం. ముఖ్యంగా ఉగాది సమయం గంటలు, రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, ఋతువులు, ప్రాణులు కాలస్వరూపమైన సంవత్సరంలో నివసిస్తున్నాయి.

తృట్యైనమః,నిమేషాయనమః,కాలాయనమః అంటూ ప్రకృతిని,ప్రకృతికి కారణమైన శక్తిని ఆరాధిస్తాము.ఉగాదినాటి పంచాంగం పూజ,పంచాంగం పూజ,పంచాంగం శ్రవణం కాలస్వరూపనామార్చనకు ప్రతీకం.పంచాంగ పూజ,దేవి పూజ సదృశమైంది.అంతం,ముసలితనం,మరణం లేనిది కాలస్వరూపం.అదే దేవి స్వరూపం.అందుకే పంచాంగం పూజ,పంచాంగ శ్రవణం,దేవి పూజ ఫలాన్ని ప్రసాదిస్తుంది.విక్రమార్కుడు పట్టాభిషిక్తుడైన శుభదినం చైత్రశుద్ధపాడ్యమి.ఆనాడే విక్రమార్క శకం ప్రారంభమైంది.

శకులపై శాలివాహనులు సాధించిన ఘన విజయం ఉగాది పచ్చడిలోని తీపికి,యుద్ధంలో కలిగిన కష్టనష్టాలు చేదుకు,శత్రువులను తమలో ఒకరుగా కలుపుకోవడంలో వచ్చిన మంచిచెడ్డలు పులుపునకు చిహ్నంగా మన పూర్వీకులు భావించి స్వీకరించారు.ఈ మూడింటి కలయికకు గుర్తుగా ఆనవాలుగా విక్రమాదిత్యుని కాలంలో శాలివాహన శకారంభం నుండి ఉగాది పచ్చడి ఆస్వాదించడం ఆచారమైందని చారిత్రకుల నిర్ణయం.

ఈ పండగ ప్రత్యేకత 'ఉగాది పచ్చడి' ఈ పచ్చడిలో చేరే పదార్ధాలలో వేప పువ్వు ముఖ్యమైనది.బెల్లం,కొత్త చింతపండు పులుసు,మామిడి ముక్కలు,కొన్ని ప్రాంతాలలో అరటిపళ్ళ గుజ్జు కూడా చేర్చి పచ్చడిగా తయారుచేస్తారు.తీపి,ఉప్పు,పులుపు,చేదు,వగరు,కారం అనే షడ్రుచుల సమ్మేళనంగా జీవితంలో కష్టసుఖాలు ఆనంద విషాదాలుగా కలగలిసి ఉంటాయని చెప్పడానికి ప్రతీకగా దీన్ని అందరూ సేవిస్తారు.ఆరోగ్యానికి ఇది మంచిది.అంతేకాకుండా అంతర్గతంగా ఆరోగ్య సూత్రం ఇమిడి ఉందని తెలుపుతోంది.

మామిడాకుల తోరణాలు కట్టడం,తలస్నానం చెయ్యడం,కొత్తబట్టలు ధరించడం,పిండి వంటలు చేయడం పూర్వం నుంచీ వస్తున్న ఆచారం.ఆదాయ వ్యయాలు,రాజ పూజ్య అవమానాలు,కందాయ ఫలాలు,రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినటం ఆనవాయితి.పల్లెల్లో రైతులు ఉగాది రోజున అక్కడి దేవాలయం వద్ద అంతా చేరి,పురోహితుడిని రప్పించి,తమ వ్యవసాయానికి ఏ కార్తెలో వర్షం పడుతుంది? గ్రహణాలు ఏమైనా ఉన్నాయా? ఏరువాక ఎప్పుడు సాగాలి? వంటివన్నీ అడిగి తెలుసుకుంటారు.

మనకు తెలుగు సంవత్సరాలు 'ప్రభవ'తో మొదలుపెట్టి 'అక్షయ'నామ సంవత్సరము వరకు గల 60సంవత్సరములలో మానవులు తాము జన్మించిన నామ సంవత్సరాన్ని వారి జన్మాంతర సుకృతాలనుబట్టి జీవితంలో ఒక్కసారో,రెండుసార్లో చుస్తూంటారు! అందువల్లనే వారు జన్మించిన 60 సంవత్సరములకు తిరిగి ఆ నామ సంవత్సరం వచ్చినపుడు,అది ఒక పర్వదినంగా భావించి 'షష్టిపూర్తి' ఉత్సవాన్ని వైభవంగా చేసుకుంటూ ఉంటారు.

పంచాంగ శ్రవణం
నిత్య వ్యవహారాల కోసం ఈనాడు అందరూ ఇంగ్లీషు క్యాలెండర్ అయిన "గ్రిగేరియన్‌ క్యాలెండరు"ను ఉపయోగిస్తూ వున్నా...శుభకార్యాలు,పూజా పునస్కారాలు,పితృదేవతారాధన,వంటి విషయాలకు వచ్చేటప్పటికి

"పంచాంగము" ను ఉపయోగించడం మన పంచాంగ విశిష్టతకు నిదర్శనం.ఈ పంచాంగం ఉగాదితో అమల్లోకి వచ్చి,మళ్ళీ సంవత్సరం ఉగాది ముందురోజు వరకు అమలులో ఉంటుంది.అటువంటి పంచాంగమును ఉగాదినాడు వివిధ దేవతలతోపాటు పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి.అంతేకాకుండా 'పంచాంగ శ్రవణం' ఉగాధి విధుల్లో ఒకటి.ఈనాడు గ్రామాలు మొదలుకొని పెద్ద పెద్ద నగరాల వరకూ అన్నిచోట్లా పంచాంగ శ్రవణం నిర్వహించడం చూస్తూనే ఉన్నాము.కాగా ప్రస్తుతం పంచాంగాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి.ఇలా పూర్వం లభించేవికాదు.తాటాకుల మీద వ్రాయబడేవి కనుక పండితులవద్ద మాత్రమే ఉండేవి.కనుక వారు ఉగాదినాడు సంవత్సర ఫలాలను అందరికీ తెలియజేస్తారు.

ఈ విధముగా పంచాంగ శ్రవణం ఆచారమైనట్లు పండితుల అభిప్రాయం."పంచాంగం" అంటే అయిదు అంగములు అని అర్ధం.తిధి,వారం,నక్షత్రం,యోగం,కరణం అనేవి ఆ అయిదు అంగాలు.పాడ్యమి మొదలుకొని 15 తిధులు,7వారాలు ,అశ్వని మొదలుకొని రేవతి వరకు 27 నక్షత్రములు,విష్కభం మొదలుకొని వైధృతి వరకు 27 యోగములు,బవ మొదలుకొని కింస్తుఘ్నం వరకు,11 కరణములు వున్నాయి.వీటన్నిటినీ తెలిపేదే "పంచాంగం".పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఉత్తరాభిముఖంగా కూర్చుని పంచాంగం వింటే మంచిదని పండితుల అభిప్రాయం.పంచాంగ శ్రవణంలో ప్రధానంగా ఆ సంవత్సర ఫలితాలను వివరిస్తారు.అంటే నవనాయకులను తెలుసుకుని వారిద్వారా ఫలాలను అంచనా వేస్తారు.సంవత్సరంలో ఏ ఏ గ్రహాలకు ఏ ఏ అధికారం లభిస్తుందో తెలుసుకుంటారు.ఆ గ్రహాలే ఆ సంవత్సర నవ నాయకులు.వీరికి లభించే అధికారాన్ని బట్టి ఆ సంవత్సర ఫలితాలు ఉంటాయి.

నవనాయకులు
1.రాజు - చాంద్రమాన సంవత్సర ప్రారంభదిన వారాలకి అధిపతి ఆ సంవత్సరానికి రాజు. 
2.మంత్రి - సౌరమాన సంవత్సర ప్రారంభదిన వారానికి అధిపతి ఆ సంవత్సరానికి రాజు. 
3.సేనాధిపతి - సూర్యుడు సింహరాశికి ప్రవేశించేనాటి వారానికి అధిపతి. 
4.సస్యాధిపతి - సూర్యుడు కర్కాటక రాశిలోనికి ప్రవేశించేనాటి వారానికి అధిపతి.